గుజరాత్, 23 జూన్ (హి.స.)
గుజరాత్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక సూరత్ను భారీ వరదలు ముంచెత్తాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. దీంతో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు. భద్రతా దృష్ట్యా జిల్లా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
భారీ వరదలు కారణంగా విద్యార్థులను బయటకు రానివ్వొద్దని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం కోరింది. 24 గంటల్లో దాదాపు 6 అంగుళాల వర్షం కురిసినట్లుగా ఐఎండీ పేర్కొంది. సూరత్, వల్సాద్, జామ్నగర్, జునాగఢ్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అహ్మదాబాద్, రాజ్కోట్, గాంధీనగర్, మెహ్సానా వంటి నగరాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అమ్రేలి, భావ్నగర్, నవ్సరి, వడోదర వంటి అదనపు జిల్లాల్లో కూడా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్