అమరావతి, 26 జూన్ (హి.స.)
ఏపీ టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్ల ను అప్పగించే పనులు వేగవంతం చేసేందుకు సహకరించాలని మంత్రి నారాయణ బ్యాంకర్లను కోరారు. బుధవారం ఏడీసీఎల్ భవనంలో బ్యాంక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పీఎంఏవై(పట్టణ) పథకం విజయవంతం చేయడంలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కోరారు. దీపావళి నాటికి ఇళ్లను పూర్తి చేయడానికి పెండింగ్ నిధులను విడుదల చేయాలని, కొత్త రుణాలను అందించడంలోనూ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు తమ వంతు మద్దతు అందిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే, అప్పగించిన ఇళ్లకు సంబంధించిన రికవరీ రావడం లేదనే విషయాన్ని బ్యాంకర్లు మంత్రి దృష్టికి తీసుకురాగా, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ