తెలంగాణ, మహబూబ్నగర్. 26 జూన్ (హి.స.)
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయేందిర గురువారం గండీడ్ మండలం సల్కార్ పేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు బోధన, హాజరు, భోజన నాణ్యతలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్... చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లలకు రోజూ కొత్త పదాలు, అక్షరమాలలు, ప్రాథమిక గణిత భావనలు బోధించాలని చెప్పారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రంలో భోజనం నాణ్యత పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్... పప్పు చారు పలుచగా ఉండటం, గుడ్డు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. జడ్పీ హైస్కూల్ మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన కలెక్టర్, కూర నీళ్ళలా ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు