తెలంగాణ, నల్గొండ. 26 జూన్ (హి.స.)
విద్యార్థులు స్థిరమైన లక్ష్యంతో ప్రణాళికాయుతంగా చదివి జీవితంలో స్థిరపడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం వర్సిటీలో విద్యార్థులకు నిర్వహించిన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కార్యక్రమ ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చంచల స్వభావాన్ని వీడి స్పష్టమైన అవగాహన, సమయ పాలన, నిరంతర శ్రమతో విజయాలు అందుకోవాలని సూచించారు.
అవాంతరాలను అధిగమిస్తూ నిర్మాణాత్మక ఆలోచన విధానాన్ని అలవర్చుకుని విజయపథంలో ముందుకు సాగాలన్నారు. సమాజం పట్ల బాధ్యత, మానవీయ సమాజ నిర్మాణ లక్ష్యంగా విద్యార్థులు ముందడుగు వేయాలన్నారు. విద్యార్థులు తమ ఐచ్చిక అంశాలను గుర్తించి వాటిలో నిష్ణాతులుగా తయారైతే విజయం సొంతమవుతుందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు