విజయనగరం, 27 జూన్ (హి.స.) ప్రసిద్ధ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లాలో వందల కోట్ల రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ స్వయంగా జిల్లాలో పర్యటించి, పరిశ్రమ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు.
విజయనగరం జిల్లా, కొత్తవలస మండలంలోని చినరావుపల్లి గ్రామంలో 172 ఎకరాల విస్తీర్ణంలో ఈ పరిశ్రమను నెలకొల్పనున్నట్లు బాబా రాందేవ్ మీడియాకు వివరించారు. ఇక్కడ భారీ స్థాయిలో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును బాబా రాందేవ్ ‘దూరదృష్టి గల నాయకుడు’ (విజనరీ లీడర్) అని ప్రశంసించారు. ఆయన నాయకత్వ పటిమ, సహకారం వల్లే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో కలిసి ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి