నెల్లూరు, 7 జూన్ (హి.స.)ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. శుక్రవారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో ఆదిశంకర తొలి డీమ్డ్ యూనివర్సిటీ అని చెప్పారు. 2001లో గూడూరు (ప్రస్తుతం తిరుపతి జిల్లా) సమీపంలో ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ను ప్రారంభించామని, ఇప్పుడు 8 వేల మంది విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీల్లోనే అగ్రభాగాన నిలిచిందన్నారు.
ఆదిశంకర ప్రాంగణంలో ఆదిశంకర పాలిటెక్నిక్, లా కాలేజీ, ఫార్మసీ, బీఈడీ కళాశాలలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 2011లో జేఎన్టీయూతో శాశ్వత అనుబంధం పొందామని, 2013లో తొలి అటానమస్ ఇనిస్టిట్యూట్ హోదా తమ సంస్థ సాధించిందని తెలిపారు. 2021లో నాక్ ఏ ప్లస్ ప్లస్ గుర్తింపు సాధించామన్నారు. 2022లో ఆల్ కోర్ ప్రోగామ్స్-ఎన్బీఏ అక్రిడిటేషన్ సాధించామని తెలిపారు. ఏఐ, రోబోటిక్స్, స్పేస్సైన్సు కోర్సులు ప్రారంభించటం ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ లక్ష్యంగా పెంచలయ్య పేర్కొన్నారు. కోవూరు సమీపంలోని రామన్నపాళెంలో ఆదిఽశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని ప్రారంభించామని, ఈ కాలేజీలో కౌన్సిలింగ్ ద్వారా చేరే ప్రతిభ గల పేద విద్యార్ధులకు యాజమాన్య కోటాలో 10 శాతం ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ