హైదరాబాద్, 7 జూన్ (హి.స.)
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు.. ఇదే కాంగ్రెస్ పాలన అని విమర్శించారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాళ్లు అంటే.. దాన్ని పట్టుకొని దుడ్డెని కట్టేయమని బీజేపీ వాళ్లు అంటున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇచ్చిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమానికి శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో సంపూర్ణమైన న్యాయం చేసింది. నీళ్ల విషయంలో కృష్ణా, గోదావరిలో ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టి చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కాలంతో పోటీపడి కట్టినా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90 శాతం పూర్తిచేసినా, సీతారామ ప్రాజెక్టును కూడా 90 శాతం పూర్తిచేసి తెలంగాణ రైతాంగం ప్రయోజనం కోసం కేసీఆర్ సర్కార్ నిరంతరం పనిచేసింది. కానీ నేడు నీళ్లు, నిధులు, నియామకాలు అనే శీర్షిక ఎక్కడో పోయింది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఇది అంటు మండిపడ్డారు
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్