కేసీఆర్ ముందుచూపుతోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణం : హ‌రీశ్ రావు
హైదరాబాద్, 7 జూన్ (హి.స.) మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మించార‌ని, మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మాజీ నీటి పారుద‌
హరీష్ రావు


హైదరాబాద్, 7 జూన్ (హి.స.)

మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపుతోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మించార‌ని, మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మాజీ నీటి పారుద‌ల శాఖ‌ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు అన్నారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ను ఇచ్చారు. మొత్తంగా ప్రాజెక్టు ద్వారా 20.33 లక్షల ఎకరాలకు నీరందించామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పకుండా చర్చలు జరిపామన్నారు.

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని, పొలాల‌కు నీళ్లిచ్చి రైతు కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని హ‌రీశ్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు-వాస్తవాలు’ అనే పేరుతో నేడు తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ,బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నాయని హ‌రీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి ఎటువంటి అభ్యంత‌రాలు చెప్ప‌కుండా ఒప్పించామన్నారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు, తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశామ‌న్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande