గుంటూరు, 7 జూన్ (హి.స.)): కీర్తిచక్ర అవార్డు పొందిన ఆర్మీ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడు కుటుంబ సభ్యులతో గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేశ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాంగోపాల్ నాయుడు మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ, 56వ బెటాలియన్, రాష్ట్రీయ రైఫిల్స్ మేజర్గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద ప్రాణాలకు తెగించి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతోపాటు తోటి సైనికులను రక్షించారు. దీంతో మేజర్ రాంగోపాల్ నాయుడును ఈ ఏడాది మే 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీర్తిచక్రతో సత్కరించారు. ఈ అవార్డుకు ఎంపికైన మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా రాంగోపాల్ నాయుడు నిలిచారు. ఈ సందర్భంగా రాంగోపాల్ నాయుడును మంత్రి లోకేశ్ అభినందించారు. దేశంతోపాటు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావడం గర్వకారణంగా ఉందని ప్రశంసించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ