తెలంగాణ, నల్గొండ. 7 జూన్ (హి.స.)
కనగల్ మండలం ధర్వేశిపురంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. రేణుక ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం పరిసమాప్తి అయ్యాయి. మూడు రోజులుగా పూజాది కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చివరి రోజు శనివారం ఉదయం ఆలయం వద్ద 108 కళాశాలలతో అష్టోత్తర శతక అభిషేకం కార్యక్రమంతో పాటు మహా పూర్ణహుతి, త్రిశూల స్థానం, నిరాజనం, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. నేడు అమ్మవారిని మంత్రి వెంకట్రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని రూ.7 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆలయ వద్ద సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, బ్రిడ్జి నిర్మించడం జరిగిందన్నారు. దాంతో పాటు ఆలయం వద్ద కల్యాణ మండపం ఏర్పాటుతో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు