న్యూఢిల్లీ , 8 జూన్ (హి.స.)కెనడాలోని ఆల్బెర్టాలో జూన్ 15-17 వరకు జరుగబోతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత నేపథ్యంలో, ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం రాకపోవడమో లేక ఆయనే ఈ సమావేశానికి వెళ్లకపోవడమో జరుగుతుందని అందరూ అంచనా వేశారు. అయితే, శుక్రవారం కార్నీ స్వయంగా మోడీకి ఫోన్ చేసి సమావేశాలకు రావాలని కోరారు. ఆయన ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారు.
అయితే, మార్క్ కార్నీ మోడీని ఆహ్వానించడంపై కెనడాలోని ఖలిస్తానీవాదులు, ఖలిస్తానీ అనుకూల పార్టీలు మార్క్ కార్నీని విమర్శిస్తున్నాయి. అయితే, ఈ విమర్శలకు ఆయన ధీటుగా బదులిచ్చారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని, భారత్ అనేక కీలకమైన ప్రపంచ సప్లై చైన్కి కేంద్రంగా ఉందని ఆయన అన్నారు. 2023లో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై స్పందించిన కార్నీ.. ఈ కేసులో చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున తాను వ్యాఖ్యానించడం సముచితం కాదని విలేకరులతో చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు