న్యూఢిల్లీ - , 8 జూన్ (హి.స.)ప్రకృతి విపత్తుల నుంచి సంభవించే ప్రమాదాలను తగ్గించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అలాగే విపత్తులను తట్టుకోగలిగే మౌలిక వసతులను నిర్మించాలంటే ప్రపంచం అయిదు అంశాలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పేర్కొన్నారు. అవి.. 1. నైపుణ్య మానవ వనరులను సిద్ధం చేసుకోవడం, 2. విపత్తులను సమర్థంగా ఎదుర్కొన్న అనుభవాలను వివరించే పత్రాలతో అంతర్జాతీయ డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు, 3. విపత్తుల రాకను ముందుగానే హెచ్చరించే వ్యవస్థల నిర్మాణం, 4. విపత్తుల నిభాయింపునకు నిధులు సమకూర్చడం, 5. అంతర్జాతీయ సమన్వయ సహకారాలు అని వివరించారు. విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల నిర్మాణంపై 2025 సంవత్సరానికి ఫ్రాన్స్లో నిర్వహిస్తున్న సభను ఉద్దేశించి మోదీ వర్చువల్ ప్రసంగం చేశారు. సముద్ర తీర ప్రాంతాలకు ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ అనే అంశంపై ఈ మహాసభను నిర్వహిస్తున్నారు. భారతదేశం చిన్న వర్ధమాన ద్వీప దేశాలను వాతావరణ విపత్తుల నుంచి కాపాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తోందని మోదీ చెప్పారు. 1999 సూపర్ సైక్లోన్, 2004 సునామీ నుంచి భారత్ త్వరగా తేరుకుందని గుర్తుచేశారు. తీర ప్రాంతాలలో తుపాను షెల్టర్లను నిర్మించామని, తాము ఏర్పాటు చేసిన సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ 29 దేశాలకు ప్రయోజనం కలిగిస్తోందని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు