అమరావతి, 8 జూన్ (హి.స.)జేఈఈ అడ్వాన్స్డ్-2025 ఫలితాల్లో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విజయవాడ నారాయణ కళాశాల విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 10వ ర్యాంకు సాధించిన వడ్లమూడి లోకేశ్, 51వ ర్యాంకు సాధించిన భానుచరణ్ రెడ్డి, 82వ ర్యాంకు సాధించిన తోరాటి భరధ్వాజ్, 98వ ర్యాంకు సాధించిన జస్వంత్ వెంకట రఘువీర్ను, వారి తల్లిదండ్రులను ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో ప్రవేశం సాధించడం సామాన్య విషయం కాదని, ఇంతటి ప్రతిభావంతులైన విద్యార్థులు మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జన్మభూమితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతికి పాటుపడాలని కోరారు. టాప్ ర్యాంకుల సాధనకు విజయ సారథ్యం వహించిన నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. మరెందరో విజేతలను ఆవిష్కరించాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ