దిల్లీ: 11 జూలై (హి.స.)యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు ఈ నెల 14న భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. యాక్సియం-4 మిషన్ ద్వారా శుభాంశుతో పాటు పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నియొస్కీ, టిబర్ కపు ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లారు. 28 గంటల ప్రయాణం తర్వాత వారు ఐఎస్ఎస్లో ప్రవేశించారు.
దాదాపు రెండు వారాలుగా ఐఎస్ఎస్లో ఉన్న శుభాంశు శుక్లా.. అక్కణ్నుంచి ఇప్పటివరకూ 230 సూర్యోదయాలు చూశారు. ఏకంగా 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. యాక్సియం స్పేస్ ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ