అమరావతి, 12 జూలై (హి.స.)
అమరావతి,): జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పన్ను ఎగవేతలు అరికట్టేందుకు డేటా ఎనలిటిక్స్ వంటి టెక్నాలజీని వాడాలని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు.
జీఎస్టీ వసూళ్లలో అగ్రగామిగా నిలిచేందుకు సరైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని దాని ప్రకారం పనిచేయాలన్నారు. పన్ను ఎగవేతలను గుర్తించేందుకు కరెంటు బిల్లు వినియోగాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్రం నాలుగో ర్యాంకు సాధించిందని, అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడమే తన ధ్యేయమని చెప్పారు. కేంద్ర జీఎస్టీ జోనల్ కార్యాలయం, రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మించుకోవడం కోసం అమరావతిలో 5 ఎకరాల స్థలం కావాలని కేంద్ర జీఎస్టీ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ