హైదరాబాద్, 13 జూలై (హి.స.)
క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. ఆఫీస్ ఎదుట మీడియాతో మాట్లాడారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అని అన్నారు. ఇలాంటి దాడులకు మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే అవుతుందని విమర్శించారు. 'మా గన్మెన్ వద్ద నున్న తుపాకీ లాక్కొని మరీ మా సిబ్బందిపై దాడి చేశారు. నాతో సహా పలువురికి గాయాలు అయ్యాయి. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం మాపై హత్యాయత్నానికి పాల్పడింది. ఇక మేము ఊరుకోం... మీరో, మేమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కంచం-మంచం అనేది తెలంగాణలో ఊతపదం.. నేను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నాను. నేనేం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారు. రౌడీల్లా మాపై దాడి చేయడమే కాకుండా.. మళ్లీ నామీదే కేసు పెట్టారు. నా ఆఫీస్లో నా రక్తం కళ్లజూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తాను. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలి. ఈ దాడి ఘటనపై ఇప్పటికే కంప్లైంట్ చేశాం. పోలీసులపై, వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నాము' అని తీన్మార్ మలన్న అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్