తెలంగాణ, మెదక్. 13 జూలై (హి.స.)
ఆషాడ మాసం మూడవ ఆదివారం పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని వనదుర్గామాతను వనంలో వనదుర్గామాతగా వివిధ రకాల మొక్కల అలంకరణలో విశేషంగా అలంకరించారు. వేకువజామునే అమ్మవారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి వివిధ రకాల మొక్కలతో అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
భక్తులు మంజీరా నది పాయలు, చెక్ డ్యామ్ లో పుణ్య స్నానాలు ఆచరించి వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. అమ్మవారికి డప్పు చప్పుళ్లు, మేళ తాళాలతో బోనాలు, ఓడి బియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు