తిరుపతి, 7 జూలై (హి.స.)టీటీడీలో ఇతర మతస్తులు ఉద్యోగులుగా కొనసాగుతున్నారన్న ముచ్చ.. రాజకీయంగా రచ్చరేపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో.. వెయ్యిమందికిపైగా అన్యమతాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారంటూ.. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. ఇటీవల తన పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్న సంజయ్… తిరుమల పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అయితే, ఉద్యోగులకు సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ మాత్రం.. ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్ని షేక్ చేశాయి. టీటీడీ పాలకమండలికి బండి సంజయ్ ఏకంగా హెచ్చరిక జారీ చేయడం.. తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టిందనే చెప్పాలి. అయితే, బండి సంజయ్ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమనకరుణాకర్రెడ్డి. ఇది వెంకటేశ్వరస్వామి ఆలయంపై సంజయ్ చేసిన దాడిగా అభివర్ణించారాయన.
అయితే, భూమనకు ఏపీ బీజేపీనేత, టీటీడీ మెంబర్ భానుప్రకాష్ మరో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో వివాదం మరింత రాజుకుంది. టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది.. పైకి మాత్రమే రాముడు, కృష్ణుడు పేర్లతో కనిపిస్తున్నారనీ.. లోలోపల మాత్రం వాళ్లంతా అన్యమతాచారాలు పాటిస్తున్నారనీ ఆరోపించారు. 2019 -2024 మధ్య రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగడం వల్లే ఇదంతా జరిగిందన్న భానుప్రకాష్… టీటీడీ ఉద్యోగుల ఇళ్లలో సర్వేకు భూమన సిద్దంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. మొత్తానికి, మరో అంశంలో తిరుమలకొండ.. వివాదంలో నిలిచింది. మరి ఈ జగడం ఇక్కడితో ఆగుతుందా? ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా కంటిన్యూ అవుతుందా అన్నదే పొలిటికల్గా ఆసక్తి రేపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి