అమరావతి, 15 జూలై (హి.స.)ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు.సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని మంత్రి అన్నారు. ఈ రోజు(మంగళవారం) విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోని ఏకడమిక్ బ్లాక్ను, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ. 2 వందల కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్న గత జగన్ ప్రభుత్వంలో కేవలం రూ.38 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు. వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇటీవల మాజీ సీఎం జగన్ పర్యటనలో చోటుచేసుకున్న ఘటనలు దారుణం అన్నారు. ఈ తరుణంలో వేల మందితో పరామర్శలకు వెళ్లడం ఎక్కడ చూడలేదని మంత్రి ఎద్దేవా చేశారు. పరామర్శల పేరుతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్వి పరామర్శలా.. దండయాత్రలా? అని మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి