అమరావతి, 16 జూలై (హి.స.)
ఏలూరు విద్యా విభాగం, జిల్లాకు చెందిన ఒక ఇంజినీరింగ్ విద్యార్థిని అరుదైన ఘనతను సాధించింది. ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఏఐడీఎస్ నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న పెన్మెత్స నిఖిత ప్రముఖ సంస్థ అమెజాన్లో రూ.46.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికైందని ఆ కళాశాల ప్రధానాచార్యుడు కె.వెంకటేశ్వరరావు తెలిపారు. భీమడోలు మండలం మల్లవరం గ్రామానికి చెందిన ఈమె తండ్రి సోమరాజు వ్యాపారి. తల్లి విజయదుర్గ గృహిణి. ఈమె అక్క ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. నిఖిత చిన్నతనం నుంచి చదువులో ఉత్తమ మార్కులు సాధించడంతోపాటు వివిధ రకాల పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేది. సాఫ్ట్వేర్ ఇంజినీరు కావాలనే ఆశయంతో ఎంతో కష్టపడి చదివిన ఈమెకు అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీరుగా ఉద్యోగం లభించింది. ఈ సందర్భంగా ఆమెను కళాశాల కరస్పాండెంట్ జాస్తి మల్లికార్జునుడు, ఇన్ఛార్జి కరస్పాండెంట్ కె.హరిరామకృష్ణరాజు, సీఎస్ఈ విభాగాధిపతి ఏసుబాబు తదితరులు అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ