విశాఖపట్నం, 17 జూలై (హి.స.)విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట యువతను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని విశాఖపట్నం సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి మాటలు నమ్మి విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్పోర్టులో ఉన్న ఐదుగురిని కాపాడారు. బుధవారం విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 13వ తేదీ రాత్రి తనకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి గాజువాక ప్రాంతం నుంచి మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం చెప్పారన్నారు. సైబర్క్రైమ్ పోలీసులను అప్రమత్తం చేసి ఈ నెల 14న ఎయిర్పోర్టుకు పంపించి, గాజువాకకు చెందిన ఏలేటి సురేశ్, రాజాన ఆదిలక్ష్మి అలియాస్ అను అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. కాంబోడియాలో ఉంటున్న విజయ్కుమార్ అలియాస్ సన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగులను కాంబోడియా, మయన్మార్, థాయ్లాండ్ వంటి దేశాలకు తరలించేందుకు వీలుగా 150 మంది ఏజెంట్లను నియమించుకున్నాడని వివరించారు. వారంతా నిరుద్యోగులను గుర్తించి విదేశాలకు పంపితే, వారితో నకిలీ పత్రాలు, వివరాల ఆధారంగా తప్పుడు ఫేస్బుక్, ఇస్టాగ్రామ్లో ఐడీలు సృష్టించి వాటి ద్వారా డిజిటల్ అరెస్టు, బ్యాంక్ఫ్రాడ్స్, లాటరీ ఫ్రాడ్స్, ఆన్లైన్ గేమ్ టాస్క్ పేరుతో అమాయకుల నుంచి డబ్బులు గుంజే పనులు చేయిస్తారన్నారు. ఇప్పటివరకూ కాంబోడియాకు మానవుల అక్రమ రవాణాకు సంబంధించి తొమ్మిది కేసుల్లో 24 మంది నిందితులను అరెస్టు చేసి, 87 మంది బాధితులను రక్షించామన్నారు. విదేశాలకు మనుషులను పంపించే ఏజెంట్లు, సంస్థలకు ఉండాల్సిన అనుమతులు, అర్హతలకు సంబంధించిన వివరాలు ప్రజలకు తెలిపేలా రూపొందించిన రెండు పోస్టర్లను సీపీ ఆవిష్కరించారు. ఎవరికైనా మానవ అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారంగానీ, ఏజెంట్ల గురించి గానీ తెలిస్తే సైబర్క్రైమ్ హెల్ప్ లైన్ 1930 నంబర్కుగానీ లేదంటే తన వ్యక్తిగత ఫోన్ నంబర్ (7995095799)కు సమాచారం ఇవ్వాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ