అమరావతి, 17 జూలై (హి.స.)
,కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ మంత్రి లోకేశ్ చేస్తున్న సాయంతో ఓ చిన్నారి ప్రాణం నిలబడింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపునాయుడు అనే చిన్నారి పుట్టుకతోనే లివర్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు జగదీష్, ఇంద్రావతి ఆ చిన్నారిని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలవగా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలకు లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ) మంజూరు చేశారు. అయితే అధిక మొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేశ్ను కూడా కలిశారు. ఆయన వైద్యసాయంగా రూ.15 లక్షల వరకు పెంచి ఎల్ఓసీ మంజూరు చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ అనంతరం ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఆ చిన్నారిని తల్లిదండ్రులు.. గుంటూరు జిల్లా ఉండవల్లిలో లోకేశ్ బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆ బాలుడిని ఎత్తుకుని ముద్దాడిన లోకేశ్.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ‘మీరు చేసిన సాయం మరువలేం’ అంటూ తల్లిదండ్రులు లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ