న్యూఢిల్లీ 18 జూలై (హి.స.) -గత పదేళ్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం తన బావను (రాబర్ట్ వాద్రాను ఉద్దేశిస్తూ) వెంటాడుతూనే ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమ ఆరోపణల కేసులో రాబర్ట్ వాద్రా (Robert Vadra)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనే శుక్రవారం రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు.
గత పదేళ్లుగా ఈ ప్రభుత్వం తన బావను వెంటాడుతూనే ఉందని రాహుల్ మండిపడ్డారు. ఈ తాజా ఛార్జిషీటు కూడా ఆ కోవకు చెందినదేనని విమర్శించారు. దురుద్దేశంతో, రాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును ఎదుర్కొనేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంకల కుటుంబానికి తాను అండగా ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు. ఈసందర్భంగా వీటిని తట్టుకునే ధైర్యం వారందరికీ ఉందని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈడీ వివరాల ప్రకారం.. వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో హరియాణాలో శికోహ్పుర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లుగా పేర్కొంది. నాలుగేళ్ల తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ సంస్థ అయిన డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించింది. ఈ లావాదేవీలపై మనీలాండరింగ్ ఆరోపణలొచ్చాయి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ