తిరుమల, 24 జూలై (హి.స.)
, తిరుమలలో అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఐవోసీఎల్ గ్యాస్ స్టోరేజీ కేంద్రం ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఇటీవల తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఐవోసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ వి.సతీష్కుమార్తో కలిసి భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. తితిదేకు రెండు దశాబ్దాలుగా ఎల్పీజీని నిరంతరాయంగా సరఫరా చేస్తుండగా... ప్రస్తుతం మరో 30 ఏళ్ల పాటు ఎల్పీజీ సరఫరాకు రెండింటి మధ్య ఒప్పందం కుదిరింది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం సమీపంలోని ఎల్పీజీ గ్యాస్ కేంద్రాన్ని గతంలో నిర్మించారు. ఈ కేంద్రం తిరుమలకు మధ్యలో ఉంది. ఎల్పీజీ ట్యాంక్లు బయటే ఉంటున్నాయి. ఏదైనా లీకేజీ చోటుచేసుకుంటే ఎల్పీజీ గాలిలో కలిసి ఆలయంవైపు ఇతర ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2021లో ప్రస్తుత ఏపీ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.వి.శివకుమార్రెడ్డి, మరికొందరు నిపుణులతో తితిదే ఓ కమిటీ వేసి సూచనలు కోరింది. పరిశీలించిన కమిటీ భక్తుల భద్రత దృష్ట్యా వెంటనే ఎల్పీజీ ప్లాంట్ను మరో ప్రాంతానికి తరలించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి సహకారంతో ప్లాంట్కు భూమిపూజ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ