కోవూరు27 జూలై (హి.స.), :కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్కుమార్ యాదవ్ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను శనివారం విచారణకు హాజరుకాలేకపోతున్నానంటూ తన న్యాయవాది ద్వారా కోవూరు సీఐ సుధాకరరెడ్డికి సమాచారం అందించారు. ఈనెల 30, 31 తేదీల్లో హాజరవ్వడానికి అనుమతించాలని పోలీసులను కోరినట్లు సమాచారం. కాగా, ఈకేసు విషయమై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసినందున విచారణకు ఆయన హాజరుకాలేదని వైసీపీ నాయకులు చెప్పారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు కూడా విచారణకు గైర్హాజరయ్యారు. కాగా, ఈ కేసులో వైసీపీ నేతలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నీలపరెడ్డి హరిప్రసాదరెడ్డి, అత్తిపల్లి అనూ్పరెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఐ ప్రశ్నలకు వారు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పిలిచినప్పుడు రావాలంటూ ఆ నాయకులకు పోలీసులు నోటీసులిచ్చారు. జామీనుదార్లను ప్రవేశపెట్టేందుకు సోమవారం వరకు గడవు కావాలని వైసీపీ నాయకులు కోరినట్టు తెలిసింది. విచారణకు హాజరైన నేతలకు సంఘీభావంగా పలువురు వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ