అమరావతి, 29 జూలై (హి.స.)
అనంత నేరవార్తలు, : తమ కుటుంబంపై కొందరు వివక్ష చూపుతూ, దుర్భాషలాడి దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని కళ్యాణదుర్గం మండలం కొండాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు సుధామణి, శ్రీనివాసాచారి వాపోయారు. సోమవారం ఎస్పీ జగదీశ్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో బాధితురాలు సుధామణి మాట్లాడుతూ.. తాను ముప్పై ఏళ్లకు పైగా కొండాపురంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ, అదే గ్రామంలో సొంతిళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నానని తెలిపారు. ఈ నెల 13న సాయంత్రం తమ ఇంటి ముందు చీపురుతో శుభ్రపరుస్తుండగా, ఇంటి పక్కనున్న శాంతమ్మ గొడవ దిగిందన్నారు. చెత్త ఊడుస్తున్న స్థలం తమదని, మీకేం సంబంధం అంటూ అసభ్యంగా మాట్లాడారన్నారు. అంతలో సురేశ్, లాల్కృష్ణ, వారి భార్యలు తమపై ఇష్టారాజ్యంగా దాడి చేశారన్నారు. అడ్డొచ్చిన తన కుమార్తెను అసభ్యంగా దూషిస్తూ కాళ్లతో తన్నారని వాపోయారు. అదేరోజు కళ్యాణదుర్గం రూరల్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు కనీసం విచారణ చేయకుండా వదిలేశారన్నారు. తమపై దాడి చేసిన వారు ఈ నెల 19న ఫిర్యాదు చేస్తే సీఐ కేసు నమోదు చేశారన్నారు. బాధితులమైన మేము ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధితురాలు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ