అమరావతి, 30 జూలై (హి.స.)
శ్రీహరికోట, భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్16 ప్రయోగం చేపట్టేందుకు కౌంట్డౌన్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం 2.10 గంటలకు ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 5.40 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్16 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. జీఎస్ఎల్వీ.. నాసా, ఇస్రో సింథటిక్ ఎపెర్చర్ రాడార్ ఉపగ్రహాన్ని సూర్య అనువర్తిత కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. జీఎస్ఎల్వీ బయలుదేరిన 18.59 నిమిషాలకు 747 కిలోమీటర్ల ఎత్తులో 2,392 కిలోల బరువున్న నైసార్ ఉపగ్రహం విడిపోనుంది. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ నారాయణన్ కౌంట్డౌన్ ప్రక్రియ, జీఎస్ఎల్వీని పరిశీలించి వచ్చారు. రాకెట్ ప్రయోగం దృష్ట్యా ఇస్రోలోని వివిధ కేంద్రాల డైరెక్టర్లు, సీనియర్ శాస్త్రవేత్తలు షార్కు విచ్చేశారు. నాసాకు చెందిన శాస్త్రవేత్తలూ షార్కు చేరుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ