అమరావతి, 31 జూలై (హి.స.)
అమరావతి: సింగపూర్ పర్యటన విజయవంతమైందని, ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. గురువారం సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. తాము ఎంవోయూలు చేయట్లేదని, నేరుగా కార్యరూపంలోకి తెస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టాలని జూమ్కాల్ ద్వారా ఆర్సెల్లార్ మిత్తల్ను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ప్లాంట్, డేటా సెంటర్లు ఏపీలో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు.
‘‘2019-24 మధ్య ఏపీ బ్రాండ్ను జగన్ నాశనం చేశారు. అమరావతిని సంయుక్తంగా అభివృద్ధి చేద్దామని సింగపూర్ కోరింది. ఆ దేశ ప్రభుత్వం చెప్పే మాటలు వినకుండా గత ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసింది. పారదర్శకతలో సింగపూర్ అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దేశంపై అవినీతి ముద్ర వేశారు. అమర్రాజా, లులు సహా పలు కంపెనీలను జగన్ తరిమేశారు. కానీ, కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, ఏపీకి చంద్రబాబు ఉన్నారు. ఐటీ పటంలో విశాఖను పెట్టాలని నిర్ణయించుకున్నాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ