దిల్లీ: 31 జూలై (హి.స.) హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనపై అంతర్గత విచారణ కమిటీ నివేదికను సవాల్ చేసిన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు పదునైన ప్రశ్నలు సంధించింది. జస్టిస్ వర్మ ప్రవర్తన విశ్వాసాన్ని కలిగించటం లేదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి.మసీహ్ ధర్మాసనం పేర్కొంది. తీర్పును రిజర్వు చేసింది. అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసినప్పుడే సవాల్ చేయకుండా దాని ముందు ఎందుకు హాజరయ్యారని జస్టిస్ వర్మను ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘కమిటీ నివేదిక ఇవ్వకముందే సుప్రీంకోర్టుకు వచ్చి ఉండాల్సింది. న్యాయమూర్తి తొలగింపు అంశాన్ని పార్లమెంటు పరిశీలిస్తుంది. ఆ డబ్బు మీదా, కాదా అన్నది పార్లమెంటు నిర్ణయిస్తుంది. అది అంతర్గత విచారణ కమిటీ బాధ్యత కాదు’’ అని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. జస్టిస్ వర్మ తొలగింపునకు విచారణ కమిటీ చేసిన సిఫార్సు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ