నెల్లూరు, 4 జూలై (హి.స.)
:అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి కోర్టు ఈ నెల 17 వరకూ రిమాండ్ విధించింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో కాకాణి(ఏ-8)ని గురువారం పీటీ వారెంట్పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కాకాణికి న్యాయాధికారి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
కేసు నేపథ్యం ఇదీ...:గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం విడవూరు, ముత్తుకూరు మడలం పంటపాళెంలలో 69వేల మద్యం సీసాల డంప్ను ఎక్సైజ్ ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఇద్దరు వైసీపీ నాయకులను అదుపులోకి తీసుకొని కేసును ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటంతో కేసును అంతటితో ముగించారు. ఈ కేసును తిరగదోడాలని పొదలకూరుకు చెందిన కూరపాటి విజయబాబు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ కేసును రీ ఓపెన్ చేస్తే తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తానని ఎక్సైజ్ శాఖకు తెలిపారు. విజయబాబు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో కాకాణిని ఏ-8గా చేర్చారు. పట్టుబడిన 69వేల బాటిళ్లు ఏ షాపు నుంచి, ఏ తేదీన వెళ్లాయనే అంశాలపై ఏ-1 సురేంద్రరెడ్డిని విచారించే క్రమంలో ఈ వ్యవహారంలో కాకాణికి ఉన్న లింకు బయటపడింది. అతని కాల్ లిస్ట్ పరిశీలించగా ఆ రెండు రోజులు కాకాణితో ఎక్కువసార్లు మాట్లాడినట్లు తేలింది. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో మొత్తం 35 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండగా వాటిలో 25 దుకాణాల నుంచి అదనంగా అమ్ముడుపోయినట్లు రికార్డయింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ