సంగారెడ్డి, 6 జూలై (హి.స.)
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జితేందర్ అనే కార్మికుడు ఆదివారం మృతి చెందారు. దీంతో ఈ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 41కి చేరినట్లు అధికారులు తెలిపారు. కాగా, మరోవైపు, శిథిలాల కింద లభించిన మరో మృతదేహం వివరాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గల్లంతైన మరో తొమ్మిది మంది ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పేలుడు ధాటికి కుప్పకూలిన భవన శిథిలాలను తొలగించే పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్