నెల్లూరు , 6 జూలై (హి.స.) రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నెల్లూరు నగరంలో జరిగే ప్రసిద్ధ బారాషహీద్ దర్గా రొట్టెల పండుగలో పాల్గొననున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఈ వేడుకకు హాజరుకానుండటంతో పార్టీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
అధికారికంగా విడుదలైన పర్యటన వివరాల ప్రకారం, మంత్రి లోకేశ్ సోమవారం ఉదయం తన పర్యటనను ప్రారంభిస్తారు. ఉదయం 9 గంటలకు నెల్లూరు నగరంలోని వీఆర్ మున్సిపల్ హైస్కూల్ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెల్లూరు సిటీ నియోజకవర్గానికి చెందిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో, ఆ తర్వాత సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొని, తన పర్యటనను ముగిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి