విశాఖపట్నం, 10 ఆగస్టు (హి.స.)
,:వాల్తేరు డివిజన్ పరిధిలోని పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి సెక్షన్లో మూడో లైను నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీనియర్ డీసీఎం కె.సందీప్ శనివారం తెలిపారు. మరికొన్నింటి గమ్యాలను కుదించామని, ఇంకొన్నిటిని రీషెడ్యూల్ చేశామని పేర్కొన్నారు. ఈ నెల 19 నుంచి 27 వరకు విశాఖ-రాయ్పూర్ ప్యాసింజర్ (58528), విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ (58538), విశాఖ-భవానిపట్న ప్యాసింజర్ (58504). ఈ నెల 20 నుంచి 28 వరకు రాయ్పూర్-విశాఖ ప్యాసింజర్ (58527), కోరాపుట్-విశాఖ ప్యాసింజర్ (58537), భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ (58503)ను రద్దు చేశారు. గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ (17243) ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు గుంటూరు నుంచి విజయనగరం వరకు, తిరుగు ప్రయాణంలో రాయగడ-గుంటూరు ఎక్స్ప్రెస్ (17244) ఈ నెల 20 నుంచి 27 వరకూ విజయనగరం నుంచి గుంటూరుకు నడుస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ