దిల్లీ:,10 ఆగస్టు (హి.స.) జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులకు ఊపిరాడకుండా సైన్యం (Indian Army) ఆపరేషన్లు కొనసాగిస్తోంది. తాజాగా కిష్త్వార్లో పలువురు ఉగ్రవాదులు నక్కినట్లు దళాలకు సమాచారం అందడంతో గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో దుల్ జనరల్ ఏరియాలో ఉగ్రవాదులు, దళాలకు మధ్య కాల్పులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని వైట్నైట్ కోర్ ఎక్స్లో పోస్టు చేసింది. పూర్తిగా పర్వత ప్రాంతమైన కిష్త్వార్లో టెర్రరిస్టులు ఉన్నట్లు పక్కా సమాచారం అందినట్లు సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం భారీగా కాల్పులు జరుగుతున్నాయి.
మరోవైపు కుల్గాంలో అపరేషన్ అఖల్ 10వ రోజుకు చేరింది. వీరమరణం పొందిన లాన్స్నాయక్ ప్రీత్పాల్ సింగ్, సిపాయ్ హర్మీందర్ సింగ్కు చినార్ కోర్ నివాళి అర్పించింది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది. పారా కమాండోలు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసు బలగాలు హెలికాఫ్టర్లు, డ్రోన్లు, ఇతర నిఘా పరికరాల సాయంతో ఆ ప్రదేశాన్ని జల్లెడ పడుతున్నాయి. ఇక్కడ రాత్రివేళల్లో చూసే థర్మల్ ఇమేజింగ్ పరికరాలను కూడా తీసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ