నిజామాబాద్, 12 ఆగస్టు (హి.స.)
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి జిల్లా పరిధిలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాక్లూర్ మండలం మానిక్ బండార్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు గల కారణాల గురించి జాతీయ రహదారుల సంస్థ, పోలీస్, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, రవాణా తదితర శాఖల అధికారులతో కలెక్టర్, సీపీలు చర్చించారు.
జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులపై బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాలలో ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మూల మలుపులు, కల్వర్టులు, ఎత్తుపల్లాలు, రోడ్డు నిర్మాణం సరిగా లేకపోవడం వంటి వాటిని సరి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో వాహనదారులను అప్రమత్తం చేసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్లు సహా, ఇతర ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లకు రోడ్డు భద్రతా ప్రమాణాలను విధిగా పాటించేలా ట్రాఫిక్ నిబంధనల పట్ల స్పష్టమైన అవగాహన కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..