తెలంగాణ, కరీంనగర్. 12 ఆగస్టు (హి.స.)
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల, గంగాధర వ్యవసాయ సహకార సంఘాల వద్ద యూరియా కోసం మంగళవారం రైతులు బారులు తీరారు. ఉదయం 5 గంటలకే సొసైటీల వద్దకు చేరుకొని యూరియా కోసం ఎదురు చూశారు. ఒక్కో సొసైటీకి కేవలం 450 బస్తాలు మాత్రమే చాలినంత యూరియా దొరకక రైతులు ఇబ్బంది పడ్డారు. కురిక్యాల సహకార సంఘం వద్ద ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాల యూరియాను మాత్రమే ఇవ్వడంతో సొసైటీ నిర్వాహకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రెండు బస్తాల యూరియా ఎక్కడ సరిపోతుందని, సరిపోయినన్ని ఏరియా బస్తాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నడు యూరియా కొరిత రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ యూరియా కష్టాలు మొదలైనయని రైతులు పేర్కొన్నారు. కురిక్యాల సొసైటీ పరిధిలో 3500 మంది రైతులు ఉండగా కేవలం 450 బస్తాల యూరియా మాత్రమే వచ్చింది. దీంతో యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. రైతుల కోసం దాదాపు 5000 బస్తాల యూరియా అవసరం ఉండగా కేవలం 450 బస్తాలను మాత్రమే ప్రభుత్వం పంపించడంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు