హైదరాబాద్, 13 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విపత్కర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు వర్ష బాధితులకు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అండగా నిలవాలన్నారు కేటీఆర్.
ఇప్పటికే అన్ని రంగాల్లో విఫలమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, లేకపోయినా.. ప్రతిపక్షంగా మన బాధ్యత ఎక్కువని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలు వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి త్రాగునీరు, పాలు, ఆహారం, మందులు, బట్టలు వంటి కనీస అవసరమైన సహాయాన్ని అందించాలన్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైన చోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..