తిరుమల, 5 ఆగస్టు (హి.స.)
: తిరుమలలో భక్తుల బంగారు గొలుసుల చోరీ చేసే మహారాష్ట్రకు చెందిన ముఠాను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 87 గ్రాముల బంగారు చైన్లు, ఓ కట్టర్, స్కార్పియో కారును తిరుమల వన్టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలోని ప్రసిద్ధ ఆలయాల వద్ద వీరు బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. జూన్ 17న తిరుమలలోని పీఏసీ3లోని 6వ నంబరు హాల్లో నిద్రిస్తున్న హైదరాబాద్కు చెందిన ఓ భక్తురాలి మెడలోని 47 గ్రాముల బంగారు తాళిబొట్టును వీరు దొంగిలించారు. జూలై 26న శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వద్ద కృష్ణగిరికి చెందిన 65 ఏళ్ల భక్తురాలి మెడలోని 40 గ్రాముల బంగారు తాళిబొట్టును అపహరించారు. భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు తిరుమల పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలించి వీరిని కనిపెట్టారు. అహ్మదాబాద్ జిల్లాకు చెందిన అర్జున్ మసల్కార్(24), జిల్నా జిల్లాకు చెందిన భగవాన్ బాపురావు గైక్వాడ్(42), రవి జనార్థన్ జాదవ్(38), భీడ్ జిల్లాకు చెందిన వికాస్ విజయ్ జాదవ్(27), గణేష్ సునీల్ గైక్వాడ్(30), ఆకాష్ బబన్ గైక్వాడ్(31)ను అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ