అమరావతి, 19 సెప్టెంబర్ (హి.స.)
అమరావతి: ఏపీ శాసనమండలి )లో గందరగోళం నెలకొంది. వైద్యశాలల అంశంపై చర్చించాలంటూ వైకాపా సభ్యులు ఆందోళనకు దిగారు. మండలి ఛైర్మన్ మోషేనురాజు ప్రశ్నోత్తరాలు చేపడుతున్న సమయంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు తెదేపా సభ్యులు కూడా వైకాపాకు పోటీగా నినాదాలు చేశారు. వైకాపా ఆరోపణలను తిప్పికొడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్లు ఛైర్మన్ ప్రకటించారు. వైద్యకళాశాలలపై స్వల్ప చర్చ చేపట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించామని.. సభ సజావుగా జరిగేలా సహకరించాలని వైకాపా సభ్యులను ఆయన కోరారు.
మరోవైపు జీఎస్టీ సంస్కరణల అంశంపై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను మండలి ఛైర్మన్ కోరారు. సభలో ఆర్డర్లో ఉంచాలని పయ్యావుల విజ్ఞప్తి చేశారు. వైకాపా సభ్యులు తమ ఆందోళనను కొనసాగించడంతో మండలి ఛైర్మన్ మోషేనురాజు సభను సోమవారానికి వాయిదా వేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ