తెలంగాణ, ఖమ్మం. 19 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రంలో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సొసైటీ కార్యాలయాల ముందు టోకెన్ల కోసం బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా కారేపల్లిలో శుక్రవారం యూరియా కోసం రైతులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో విశాల సహకార పరపతి సంఘం కార్యాలయం, జిన్నింగ్ మిల్లు ప్రాంగణంలో యూరియా బస్తాల పంపిణీ కొరకు కూపన్లు ఇస్తున్నారనే సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కిలోమీటర్ల మేర బారులు తీరారు. కూపన్ల కోసం రైతులంతా ఒక్కసారిగా మండల వ్యవసాయ శాఖ అధికారి చుట్టూ గుమిగూడడంతో ఏవో సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన అధికారులు ఏవోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మరోవైపు తెల్లవారుజామున నుంచి యూరియా బస్తాల కోసం ఎదురుచూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు