లక్నో/న్యూఢిల్లీ,23సెప్టెంబర్ (హి.స.): పోలీసు రికార్డుల్లో కుల ప్రస్తావన అభ్యంతరకర పరిణామాలకు దారి తీస్తోందంటూ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తదనుగుణంగా చర్యలకు ఉపక్రమించింది. పోలీసు రికార్డులతోపాటు పబ్లిక్ నోటీసుల్లో ఎటువంటి కుల ప్రస్తావన ఉండరాదని స్పష్టం చేసింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం వాహనాలపై కులం ఆధారితంగా స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించరాదని కూడా తెలిపింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు, జిల్లా యంత్రాంగాలకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కులపరమైన వివక్షను తొలగించాలంటూ ఈ నెల 16వ తేదీన హైకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు ఈ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. పోలీసు రిజిస్టర్లు, కేస్ మెమోలు, అరెస్ట్ డాక్యుమెంట్లతోపాటు పోలీస్ స్టేషన్లలో పెట్టే నోటీస్ బోర్డుల్లోనూ కుల ప్రస్తావన ఉండరాదని చీఫ్ సెక్రటరీ దీపక్ కుమార్ ఆ ఉత్తర్వులో తెలిపారు.
రాష్ట్ర క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్(సీసీటీఎన్ఎస్) పోర్టల్లోనూ కులానికి సంబంధించిన కాలమ్ను ఖాళీగా వదిలేయాలన్నారు. పోలీసు రికార్డుల్లో నిందితుల పేర్ల వద్ద తల్లిదండ్రుల ఇద్దరి పేర్లను జత చేయాలన్నారు. వాహనాలపై కులానికి సంబంధించిన స్టిక్కర్లు, నినాదాలను ప్రదర్శించే వారిపై చలాన్లు విధించాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ