హైదరాబాద్, 4 సెప్టెంబర్ (హి.స.)
పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా హిందూ పండుగ వస్తే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. డీజేలు పెట్టొద్దు, బ్యాండ్ పెట్టొద్దు అంటూ ఆంక్షలు విధిస్తున్నారని చెప్పారు. హిందూ పండుగలు ఏవిధంగా జరుపుకోవాలో చెప్పడానికి మీరు ఎవరు అని పోలీస్ కమిషనర్, డీజీపీని ప్రశ్నించారు. పండుగలు ఎలా జరుపుకోవాలో మీరే చెబుతారా అని ప్రశ్నించారు.
గణేష్ ఉత్సవాలకు మున్సిపల్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు ఎంతో సహకరిస్తారని అన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ అధికారులు పోలీసుల ట్రాప్ లో చిక్కుకోవద్దని అన్నారు. ఏడాదికి ఒక్క రోజు జరుపుకునే గణేష్ నిమజ్జనంలో డీజేలు, బ్యాండ్ పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు డీజేలు పెట్టుకోవాలని కానీ మంచి పాటలు పెట్టాలని సూచించారు. హనుమాన్ జయంతికి కూడా ఇలాంటి ఆంక్షలే విధిస్తారని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు