అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.
ఈ భేటీలో డిఅప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్, పలువురు ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలకు కేబినెట్ తీపి కబురు చెప్పింది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ పథకంతో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందనుంది. సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తించనుంది. ఇక పీపీపీ విధానంతో కొత్తగా 10 మెడికల్ కళాశాలల ఏర్పాటు ఆమోదం తెలిపారు.
రాష్ట్రంలో 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్యసేవ హైబ్రిడ్ విధానాన్ని కూటమి సర్కార్ అమలు చేయనుంది. మొత్తం 3,257 చికిత్సలను ఫ్రీగా అందించనుంది. కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ను ఏర్పాటు చేయనున్నారు. రూ.2.5 లక్షలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి