అమరావతి, 4 సెప్టెంబర్ (హి.స.)ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం మంత్రి లోకేశ్ ఈరోజు రాత్రే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
ప్రధాని మోదీతో మంత్రి లోకేశ్ జరపనున్న ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వక భేటీ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ప్రధానితో సమావేశం ముగిసిన వెంటనే మంత్రి లోకేశ్ తిరిగి రాష్ట్రానికి పయనం కానున్నారు. రేపు మధ్యాహ్నానికల్లా ఆయన రాష్ట్రానికి చేరుకుంటారని సమాచారం. అనంతరం ఆయన నేరుగా అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
జీఎస్టీ చారిత్రాత్మక సంస్కరణలను స్వాగతిస్తున్నాం: మంత్రి లోకేశ్
జీఎస్టీలో భాగంగా ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబులను రెండుకు కుదించడం, నిత్యావసరాలపై పన్ను రేట్లను తగ్గించడం వంటివి వృద్ధికి దోహదపడే సానుకూల నిర్ణయాలని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ సంస్కరణలు దేశ పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తాయని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన కొనియాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి