
అమరావతి, 16 జనవరి (హి.స.)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల సమయపాలనపై ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎవరైనా ఆలస్యంగా వస్తే ఆ రోజు జీతంలో కోత విధించాలని సైతం నిర్ణయించింది.
ఈ సంస్కరణల ద్వారా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను సైతం మార్చింది. గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామాలుగా, వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డులుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు సచివాలయ పాలనలోనూ మార్పులు తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది.------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV