
అమరావతి, 17 జనవరి (హి.స.) అమెరికా వైద్య రంగంలో కృష్ణా జిల్లా వ్యక్తి కీలక పదవిని అధిరోహించారు. అమెరికా మెడికల్ అసోసియేషన్(ఏఎంఏ) అధ్యక్షుడిగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరానికి చెందిన బాబి ముక్కామల ఎన్నికయ్యారు. ఏఎంఏను 180 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అమెరికన్ వైద్యులే దీనికి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ పదవిని అధిరోహించిన భారతీయ మూలాలు ఉన్న తొలి వైద్యుడు బాబి. అతడి తల్లిదండ్రులు డాక్టర్ అప్పారావు, సుమతి. అప్పారావు స్వగ్రామం బుద్ధవరం. ఆయన రేడియాలజి్స్టగా, సుమతి చిన్నపిల్లల వైద్యురాలిగా అమెరికాలో స్థిరపడ్డారు. అప్పారావు దంపతులకు బాబి అమెరికాలోనే జన్మించారు.
ప్రస్తుతం మిచిగాన్ రాష్ట్రంలోని ఫ్లింట్ నగరంలో హార్లీ ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఏఎంఏలో ఇంతకుముందు ఆయన ఎనిమిదేళ్లపాటు ట్రస్టీగా పనిచేశారు. ఏటా ఏఎంఏ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. బాబిని అమెరికాలో ఉన్న 10 లక్షల మంది వైద్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగుతారు. వైద్యరంగంలో అమలు చేయాల్సిన విధానాలు, వైద్యసేవల్లో చేయాల్సిన మార్పులపై ఏఎంఏ అక్కడి ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ