
అల్లూరు,:, 17 జనవరి (హి.స.)పండక్కని వచ్చిన అన్నాచెల్లెలు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి తీరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుచ్చికి చెందిన ఈగ చిన్నబ్బయ్య, ఈగ అమ్ములు, ఈగ బాలకృష్ణ అనాథలు. వీరిలో చిన్నబ్బయ్య చిట్టేడులో గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్నాడు. బాలకృష్ణ (15), అమ్ములు (14) అల్లూరు మండలం నార్తుఆములూరు గొల్లపాలెంలో పదోతరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గత మంగళవారం అల్లూరు పేటలో నిర్వహించిన పోలేరమ్మ తిరునాళ్లకు వెళ్లి అనంతరం పండక్కి అల్లూరు మజరా గ్రామమైన ఎర్రపుగుంటలోని వదిన ఇంటికి వచ్చారు.
రెండ్రోజులు ఉత్సాహంగా పండుగ జరుపుకొన్నారు. ఇస్కపల్లి పంచాయతీ ఆదిరాఘవపురం ఎన్టీఆర్ కాలనీకి చెందిన వీరి స్నేహితులు కొమరగిరి అభిషేక్ (16), చేజర్లలో గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న గంధళ్ల సుధీర్(15)తో పాటు బాలాయపల్లి మండలం పాకపురికి చెందిన బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న సిరిసినంబేటి వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఇస్కపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. స్నానం చేసేందుకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సముద్రంలోకి దిగారు. అమ్ములు, బాలకృష్ణ, అభిషేక్, సుధీర్ ఓవైపు వెళ్లగా, మిగిలిన ఇద్దరూ మరోవైపు వెళ్లారు. లోపల గుంతలు ఉన్న విషయం తెలియని ఆ నలుగురు ఒకరి తరువాత మరొకరు నీటిలో మునిగి పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ