
అమరావతి, 15 ఫిబ్రవరి (హి.స.)
తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రముఖ ఆలయాల నుండి గ్రామాల్లోని చిన్న చిన్న ఆలయాల్లో సైతం భక్తుల సందడి కనిపిస్తోంది. ఇక శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుండే స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. సాయంత్రం 5గంటలకు స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం జరగనుంది. పల్నాడులోని కోటప్పకొండకు సైతం భారీగా భక్తులు తరలివెళుతున్నారు. త్రికోటేశ్వర స్వామి దర్శనానికి క్యూ లైన్లలో భారీగా భక్తులు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు.
భక్తుల వాహనాలతో కోటప్పకొండకు వెళ్లే రహదారులు రద్దీగా మారాయి. కోటప్పకొండ పైకి వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ 120 బస్సులు నడుపుతోంది. వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయంలో శివయ్య దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం రూ.1.96 కోట్లతో ఏర్పాట్లు చేసింది. దాదాపు 600 ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు వేములవాడ చేరుకుంటున్నారు. శివరాత్రి నేపథ్యంలో ఆలయం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇక ఉదయం నుండి భక్తుల తాకిడి పెరిగిపోయింది. దీంతో రాజన్న ఆలయం శివనామస్మరణతో మారుమోగిపోతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV