సుప్రీంకోర్టులో గౌరవెల్లి ప్రాజెక్ట్ కేసు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్
గౌరవెల్లి ప్రాజెక్టు.. అనేక కారణాలు, లీగల్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Uttam kumar


హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)గౌరవెల్లి ప్రాజెక్టు.. అనేక కారణాలు, లీగల్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Telangana Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్.. సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టు కాలువల భూసేకరణ పూర్తి చేసి పనులు వేగవంతం చేసేలా సమీక్షా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ గౌరవెల్లి ప్రాజెక్టు కోసం తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ మూడు జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని అన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టులో లీగల్ ఇబ్బందులు ఎలా క్లియర్ చేయాలో చర్చించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు భూసేకరణ, పనుల వేగవంతంపై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించామన్నారు. భూసేకరణ విషయంలో హామీ ఇచ్చామని తెలిపారు. సంబంధిత నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చామని అన్నారు. ఈ మేరకు బుధవారం నాడు సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్టు కేసు విచారణ ఉందని ప్రస్తావించారు. సర్వోన్నత న్యాయస్థానంలో ఎన్వీరాన్మెంట్ కేసు గెలుస్తామనే విశ్వాసం తమకుందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును అన్ని విధాలుగా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి రావడానికి కావల్సిన పెండింగ్ పనులు పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులు, ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande