
నిర్మల్, 16 ఫిబ్రవరి (హి.స.)
నిర్మల్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. పార్టీల బలాబలాలను తలకిందులు చేస్తూ భైంసా మున్సిపల్ పీఠాన్ని స్వతంత్ర అభ్యర్థులు కైవసం చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మున్సిపల్ చైర్మన్గా ఇండిపెండెంట్ అభ్యర్థి తుమొల్ల దత్తత్రి, వైస్ చైర్మన్గా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి బిబి కుతిజ సిద్దికి ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ఆరుగురు బీజేపీ అభ్యర్థులు, ఏడుగురు స్వతంత్రులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి కలిసి ఈ స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఉంటుందని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థులంతా ఏకమై ఇండిపెండెంట్లను గెలిపించుకోవడం విశేషం. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ తన ఎక్స్-అఫీషియో ఓటును వీరికి అనుకూలంగా వినియోగించడంతో స్వతంత్రుల విజయం ఖాయమైంది. సాధారణంగా మున్సిపల్ పీఠాలపై ప్రధాన పార్టీల జెండాలు ఎగురుతుంటాయి, కానీ భైంసాలో మాత్రం స్వతంత్ర అభ్యర్థులు జైత్రయాత్ర సాగించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం స్వతంత్రులగా ఉన్న వారిలో అధికంగా బీజేపీ రేబల్ అభ్యర్థులే ఉన్నట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు